Friday, November 25, 2011

నా మొదటి సినిమా -వంశీ


 


 





చీకటి దాటేస్తే కనిపించేదంతా వెలుగే. ముళ్లు తప్పిస్తే తగిలేవన్నీ మెత్తని పూలరేకులే. వంశీ సినీజీవన యానమంతా అంతే. అందుకే సముద్ర కెరటాలకే పోటెక్కువ, నా జీవితం మాత్రం ప్రశాంత గోదావరిలా సాగింది అంటారు వంశీ తాత్వికంగా, కొంచెం తన్మయంగా.

గోదావరి వరదై ఉప్పొంగినప్పుడు కొంతమేర సారవంతమైన ఒండ్రుమట్టిని వదిలి వెళ్తుంది. ఆ నేలలో విత్తు నాటితే బంగారం పండుతుంది. ఆ గోదావరి నుంచే వచ్చిన వంశీ అనే వరద సినిమా ప్రపంచంపైకి వెల్లువెత్తి కొన్ని అద్భుత దృశ్యకావ్యాల్ని మన ముందుకు తెచ్చింది. సితార, అన్వేషణ, లేడీస్ టైలర్, ఏప్రిల్1 విడుదల లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వంశీ సినీజీవనయానంలో తొలి మలుపు ‘మంచుపల్లకి’. దాని గురించి ఆయన మాటల్లోనే...

మా ఊరు పసలపూడి.
పచ్చదనం పరుచుకున్నట్టుగా ఉంటుంది. ఇంద్రధనుస్సు అక్కడే లంగరు వేసుకున్నట్టుగా ఉంటుంది. మా ఏరియాలో ఓ బ్రాహ్మణ పిల్ల ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. నవ్వటం తన సహజ స్వభావం అన్నట్టుగా ఉండేది. ఆమె నవ్వు ప్రేరణతో ‘సత్యసుందరి నవ్వింది’ అనే కథ రాశాను. దాన్ని విజయవాడ రేడియో నుంచి కేంద్రం ‘యువరాణి’ కార్యక్రమంలో చదివాను.

మా ఊరి లైబ్రరీలో పుస్తకాలు విపరీతంగా చదివేవాణ్ని. అప్పట్లో అమలాపురంలో లెక్చరర్‌గా పనిచేస్తున్న పైడిపాల నాకు సాహిత్యంపై ఆసక్తి కలగడానికి ఓ ప్రధాన కారణం.

నా మిత్రుడు రవి పద్నాలుగేళ్ల వయసులో ఫ్రాయిడ్ రచనల్ని తెలుగులోకి అనువదించాడు. ఆ స్ఫూర్తితో అతని రూమ్‌లో కూర్చుని ‘నల్లసుశీల’ కథ రాశాను. అది 1974లో ఆంధ్రజ్యోతి దీపావళి సంచికలో ప్రచురితమైంది. ఆ తరువాత కర్మభూమి, మంచుపల్లకి నవలలు రాశాను. అప్పటికి నా వయసు పదహారు. రెక్కలు విప్పుకుని తూర్పుగోదావరి నుంచి దక్షిణ దిక్కుకు నేను ఎగిరిపోవాల్సిన సమయం రానే వచ్చింది.

నవలా వ్యాసంగం సాగిస్తున్న సమయంలోనే నాన్న చనిపోయాడు. పద్దెనిమిదేళ్ల లేత వయసులో అదొక పిడుగుపాటు. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. చీకటి ఊబిలోకి కూరుకుపోతుండగా ఓ అదృశ్య హస్తం నన్ను పైకి లాగింది. కళ్లముందు మసక నెమ్మదిగా తొలగిపోయింది. ఎదురుగా ఓ బంధువు కనిపించాడు. నాతోరా అన్నాడు. నీ అంత తెలివైనవాడు ఇక్కడ కాదు ఉండాల్సింది అని మద్రాసు తీసుకెళ్లాడు. వెళ్లేముందు ముప్ఫై రోజుల్లో తమిళ భాష పుస్తకం చదివి కొంత తమిళం ఒంటబట్టించుకున్నాను.

నాకు మొదటి నుంచీ సినిమాలు చూసే అలవాటుగానీ, సినిమా రంగం వైపు వెళ్లాలన్న ఆలోచన గానీ పెద్దగా లేవు. అయితే చిన్నప్పటినుంచీ బాపుగారంటే చాలా ఇష్టం. ఆయన్నెలాగైనా కలవాలనుకున్నాను. చేతిలో ఓ ఫైలు, రెండు నవలలు. డెరైక్టర్ బాపు ఇల్లెక్కడ అని కనబడినవారందరినీ అడుగుతూ వెళ్లాను. ఒక వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం స్ట్రెయిట్‌గా వెళ్లి ఫస్ట్ లెఫ్ట్ తిరగాలి. కానీ పొరబాటుగా సెకెండ్ లెఫ్ట్‌లో మలుపు తిరిగాను.

బాపుగారి ఇల్లనుకుని విక్టరీ మధుసూదనరావు ఇంటి తలుపు తట్టాను. ఆ ఒక్క మలుపు నా జీవితానికి సరికొత్త గమ్యాన్ని నిర్ధారించింది. ఆయన నా చేతిలోని నవలలు చదివి, ‘ఇవి నువ్వే రాశావా’ అని ఆశ్చర్యపోయారు. పత్రికలవాళ్లు నాకు పంపిన అనుమతి పత్రాలు చూపించాను. కొత్త రెండు రూపాయల నోట్లు ఇరవై నా చేతిలో పెట్టారు. కేసినో థియేటర్‌లో లూయిస్ గిల్బర్ట్ దర్శకత్వం వహించిన ‘ఫ్రెండ్స్’ సినిమా చూసి, సింగిల్‌లైన్ ఆర్డర్ రాసుకురమ్మని చెప్పారు.

ఆ సాయంత్రం సినిమా ఒక్కసారి చూసి రాత్రికి రాత్రి సింగిల్‌లైన్ ఆర్డర్ రాశాను. మరుసటి ఉదయం ఉత్సాహంగా వాళ్ల ఇంటికెళ్లాను. నేను వెళ్లేసరికి ఆయన ఎవరిమీదో కోపంతో అరుస్తున్నారు. నన్ను చూసి, ‘‘వారం తరువాత రమ్మన్నాను కదా’’ అని చిరాకుపడ్డారు. మీరు చెప్పిన పని పూర్తయిందనేసరికి ఆయన అవాక్కయ్యారు. నా చేతిలోంచి కాగితాలు తీసుకుని చదివి, నన్ను గట్టిగా హత్తుకున్నారు. వెంటనే తనతో పాటు ‘మల్లెపూవు’ షూటింగుకు తీసుకెళ్లారు. ఆ తరువాత తన దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా అవకాశమిచ్చారు.

‘ఎదురీత’ అసిస్టెంట్ డెరైక్టర్‌గా నా మొదటి సినిమా.
ఆ తరువాత ఏడిద నాగేశ్వరరావు బ్యానర్‌లో చాలా సినిమాలకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశాను. దాంతో విశ్వనాథ్, భారతీరాజా దగ్గర పనిచేసే అవకాశం దొరికింది. శంకరాభరణం, సీతాకోకచిలుక సినిమాలకు పనిచేయడం ఓ మరపురాని అనుభూతి.

మాకు సంవత్సరం పొడవునా పని ఉండేది కాదు. మద్రాసులో అప్పుడు డిటెక్టివ్ నవలల హవా నడుస్తుండేది. కొంతమంది రచయితల పేర్లతో ముందుగానే పుస్తకాల కవర్స్ ముద్రించి ఉండేవి. రచయితలకు ఘోస్టులుగా నవలలు రాసేవాణ్ని. నేనప్పట్లో వంద రూపాయల రైటర్‌ని. నవలకు వందిచ్చేవారు. స్వాతి, జ్యోతి, యువ పత్రికలకు కథలు రాసి మరికొంత సంపాదించేవాణ్ని. అలా రోజులు గడిచిపోయేవి. అసిస్టెంట్ డెరైక్టర్‌గా నేనేమంత స్ట్రగుల్ అనుభవించలేదు. శీతాకాలంలో వేణ్నీళ్లు పోసుకున్నంత హాయిగా గడిచిపోయింది నా జీవితం. ఇక సినిమా రంగంలో అసిస్టెంట్ డెరైక్టర్‌గా నా పాత్ర ముగించాల్సిన సమయం వచ్చింది.

నేను మద్రాస్ వచ్చిన కొత్తలో వేమూరి సత్యనారాయణ ఎడిటర్‌గా ఉన్న ‘జ్యోతి’ మంత్లీ కోసం ‘భారతి’ నవల రాశాను. అది చదివిన వేమూరి చాలా ఇంప్రెస్ అయ్యారు. అలా నాకు ఆయనతో సాన్నిహిత్యం ఏర్పడింది.

తరువాత రోజుల్లో వేమూరి రాజమండ్రికి చెందిన ఎం.ఆర్.ప్రసాదరావుతో కలిసి ఒక సినిమా ప్లాన్ చేశారు. అందుకోసం తమిళంలో హిట్ అయిన ‘పాలయ్‌వన్ చోలై’ రైట్స్ తీసుకుని, తెలుగులో రీమేక్ చేద్దామని ఆఫీసు తెరిచారు. గతంలో శంకరాభరణం ఆఫీస్ అది. నేను ఉండే ఇంటి పక్కనే ఆ ఆఫీస్ ఉండటంతో అప్పుడప్పుడూ వెళ్లి ఫిలిం ఫెస్టివల్స్‌లో చూసిన సినిమాల గురించి అనర్గళంగా మాట్లాడుతుండేవాణ్ని. (ప్రపంచ సినిమా పట్ల నాకు ఆసక్తి కలిగించిన చలంగారి అల్లుడు వజీర్ రెహ్మాన్‌కు కృతజ్ఞతలు).

వాళ్లు తమ సినిమా డెరైక్టర్‌గా బాపు, జంధ్యాల, రేలంగి, ఈరంకి శర్మ... ఇలా చాలామందిని అనుకున్నారు. రకరకాల కారణాల వల్ల ఎవరూ కుదరలేదు. నేనప్పుడు ‘సీతాకోకచిలుక’ సినిమాకు అసిస్టెంట్‌గా పనిచేసి ఖాళీగా ఉన్నాను.

ఓ రోజు ఉదయాన్నే వేమూరి సత్యనారాయణ ఆటోలో మా రూమ్‌కి వచ్చారు. ఈ సినిమా నువ్వే డెరైక్ట్ చేయాలని అన్నారు. మొదట షాక్ అయ్యాను. కుదరదని చెప్పేశాను. తప్పదు అని వేమూరిగారు పట్టుబట్టారు. ఈ సినిమా ఒకవేళ ఫెయిలైతే మళ్లీ నీతో సినిమా తీస్తానని నిర్మాత ఎం.ఆర్.ప్రసాదరావు వెన్ను తట్టారు.

ముప్ఫై ఏళ్లు రాకుండా డెరైక్ట్ చేయకూడదన్న నా నిర్ణయాన్ని ఆ క్షణం పక్కన పెట్టక తప్పలేదు. నా ప్రమేయం లేకుండా, నా పూర్తి ఇష్టం లేకుండా మంచుపల్లకీ మోసే బాధ్యత నా భుజాలపై పడింది. ట్రయల్ షూట్ చేశాక, నా మీద నాకు పూర్తి నమ్మకం ఏర్పడింది.

సినిమాకు ఏం పేరు పెడదాం అని ఆలోచిస్తున్నప్పుడు అందులో హీరోయిన్ పేరు గీత కాబట్టి ‘మా మంచి గీతకు మల్లెపూదండ’ అని పెడదాం అన్నారు వేమూరి. నేను తల అడ్డంగా ఊపాను.
‘చేత వెన్నముద్దకు చెంగల్వపూదండ’ అని యండమూరి వీరేంద్రనాథ్ సజెషన్. నేను మళ్లీ తల అడ్డంగా ఊపాను.
యండమూరి సడెన్‌గా నీ నవల ‘మంచుపల్లకి’ పేరు ఈ కథకు సరిగ్గా సరిపోతుందని అనడంతో అదే కరెక్ట్ అని డిసైడయ్యాం.

అప్పటికి మాంచి ఊపు మీదున్న చిరంజీవి హీరోగా చేయడానికి అంగీకరించారు. ఒరిజినల్ వెర్షన్‌లో హీరోయిన్‌గా చేసిన సుహాసిని హీరోయిన్. నేను అసోసియేట్‌గా పనిచేసిన ‘జేగంటలు’ సినిమాలో హీరోకి డబ్బింగ్ చెప్పిన రాజేంద్రప్రసాద్ గుర్తుకొచ్చాడు. అతను దేవదాస్ కనకాల దగ్గర తరచుగా కలుస్తుండేవాడు. హరి పాత్రకు అతడు ఓకే. నెక్స్ట్ కుమార్ పాత్రకు ‘యువతరం కదిలింది’లో హీరోగా చేసిన సాయిచంద్ సూపర్బ్.

‘అంతులేని కథ’ని ఇరవైసార్లు చూశాను. అందులో మిమిక్రీ ఆర్టిస్ట్‌గా చేసిన నారాయణరావు వాసు పాత్రకు పర్‌ఫెక్ట్. గాంధీ పాత్రకు ‘సప్తపది’లో ఒక హీరోగా చేసిన గిరీశ్. అంతా పేరున్న ఆర్టిస్టులే. పంతులమ్మ, నాగమల్లి చిత్రాలకు సంగీతాన్నందించిన రాజన్ నాగేంద్ర మ్యూజిక్ డెరైక్టర్స్. ‘తులసీదళం’ హిట్‌తో స్టార్ రైటర్‌గా వెలుగుతున్న యండమూరి డైలాగ్ రైటర్. హరి అనుమోలు సినిమాటోగ్రాఫర్. చిత్రకారుడు చంద్ర ఆర్ట్ డెరైక్టర్. శ్రీశ్రీ, వేటూరి, గోపీ పాటల రచయితలు.

అన్ని మేరుపర్వతాల మధ్య నేనొక పిపీలికంలా అనిపించేవాణ్ని.
అసలే కొత్తవాడు. ఎలా తీస్తాడోనని యూనిట్‌లో అందరికీ ఏ మూలో చిన్న సందేహం. హైదరాబాద్ సంజీవరెడ్డి నగర్‌లో షూటింగ్ మొదలుపెట్టాను. సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి. చిరంజీవి వెర్షన్ పన్నెండు రోజులో కంప్లీట్. ఒక్క రోజుల్లో ‘మేఘమా దేహమా’ షూటింగ్ చేశాను. ఒకే రాత్రిలో క్లయిమాక్స్ తీశాను. 1982లో వచ్చిన ఈ సినిమా కమర్షియల్‌గాను, క్రియేటివ్‌గాను నాకు సంతృప్తిని అందించింది.

‘మేఘమా దేహమా’ గీతానికి ఎస్.జానకి ఉత్తమ గాయనిగా 1982 సితార పత్రిక అవార్డు అందుకున్నారు. సినిమా బాగా నచ్చి సుహాసిని తండ్రి చారుహాసన్ ఆమె రెమ్యునరేషన్‌కు బదులుగా నెల్లూరు డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్నారు. నేను నెలకు 650 రూపాయల చొప్పున ఆరు నెలలు రెమ్యునరేషన్ తీసుకున్నాను.

అయితే ఫస్ట్ సినిమా స్ట్రెయిట్ సినిమా కాదన్న వాస్తవం తీస్తున్నంతసేపూ నన్ను సంఘర్షణకు లోను చేసింది. నేను ఎంతో ఇష్టపడి తీసుకున్న రాజన్-నాగేంద్ర మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నంతసేపూ నన్ను ఆ గదిలోకి అడుగుపెట్టనివ్వలేదు.

ఇలాంటి చిన్న పెయిన్స్ పక్కన పెడితే డెరైక్టర్‌గా ‘మంచుపల్లకి’ నాకో మధుర జ్ఞాపకం. అలా నా కలల మంచుపల్లకి కరిగి కళ్లలోంచి ఆనందబాష్పమై రాలింది. ఆ తరువాత నా సినీజీవితం ఆనంద గోదావరిలా హాయిగా సాగింది.

ఇంటర్వ్యూ: క్రాంతి, పులగం

No comments:

Post a Comment