Saturday, December 18, 2010

అసలు... చం... ద్ర... ము...ఖి...కథేంటి?

1984-85 మధ్యలో... తిరువనంతపురం... కేరళ.
రూమ్‌లో పడుకుని నిద్రపోతున్నాడు మధు ముట్టమ్. అతను మలయాళ సినీ రచయిత. ఏడాది కిందట అతని మొదటి సినిమా రిలీజ్ అయింది, ఇప్పుడు రెండో సినిమా కోసం కథ ఆలోచిస్తున్నాడు. ఎలాంటి కథ రాయాలి? అదెంత కొత్తగా ఉండాలి? ఆలోచిస్తూ భోజనం చేస్తున్నాడు, ఆలోచిస్తూ నడుస్తున్నాడు, ఆలోచిస్తూ పడుకుంటున్నారు. కొద్దికాలంగా అతనికి ఇదే ఆలోచన. ఆ రోజు కూడా ఆలోచిస్తూనే పడుకున్నాడు. అర్ధరాత్రి వేళ... హఠాత్తుగా... కలలాగా... అతనికి ఏదో ఫ్లాష్ అయింది.
దెయ్యం!
ఓ భూత్‌బంగ్లా... అందులో నాగవల్లి అనే దెయ్యం ఉందని అందరికీ భయం. ఒకప్పుడు అది రాజమహల్. ఇప్పుడు దాన్ని ఒక వ్యక్తి కొంటాడు. అతని భార్య గంగ. నాగవల్లి దెయ్యం ఆమెను పట్టుకుంటుంది. అప్పటి నుంచి ఇంట్లో అన్నీ విపరీతాలు జరుగుతుంటాయి. దెయ్యం పట్టిన గంగ తన భర్తనే చంపాలనుకుంటుంది. కాని భర్త ఫ్రెండు ఓ సైకియాట్రిస్ట్. అతనే హీరో. దెయ్యాన్ని పాతకాలం పద్ధతుల్లో వదలించడం పాత కథ. కాని దెయ్యం అనేది మానసికమైన బలహీనత... ముందు మనలోని భయాల్ని వదిలించుకుంటే ఎలాంటి దెయ్యాలు పట్టవు. కాబట్టి గంగకు సైకలాజికల్ ట్రీట్‌మెంట్ ఇస్తాడు హీరో. అదెలా జరిగింది?
ఠక్కున లేచాడు మధు. వెంటనే తనకు వచ్చిన ఐడియాని కాగితం మీద పెట్టేశాడు. అతనికి ఇప్పుడు లీలగా ఓ సినిమా మనస్సులోనే కనిపిస్తోంది. మరు ఉదయాన్నే అతను ఫాజిల్ ముందు నిలబడ్డాడు.
మలయాళంలో టాప్ డెరైక్టర్ ఫాజిల్. ఒక్క కేరళలో కాదు, దేశంలోనే టాప్ డెరైక్టర్స్‌లో ఒకడిగా ఫాజిల్‌కి గౌరవం ఉంది. ఇప్పుడు ఆయన చేతిలో ఓ కాగితం ఉంది. అందులో రైటర్ మధు ముట్టమ్ రాసిన కథ చదువుతున్నాడు ఫాజిల్.
‘‘లైన్ బాగానే ఉంది. దీన్ని డెవలప్ చేసి చూపించు...’’ అన్నారు ఫాజిల్.
క్రియేటివిటి ఉన్న వ్యక్తి ఉత్సాహానికి ఎంత ప్రోత్సాహం ఉంటే అంత హుషారుగా ఉంటాడు.
ఫాజిల్ రెస్పాన్స్ మధులో నీరసం నింపింది. బాగానే ఉందన్నారు కాని ఎగ్జయిట్ కాలేదు. దాంతో మధు ముట్టమ్ ఆ కథను పక్కన పెట్టేశాడు. నాగవల్లి దెయ్యం... ఆ కాగితంలోనే ఉండిపోయింది. ఆ కాగితం ఎక్కడో మూలన పడిపోయింది.

******
మూడు నాలుగేళ్లు గడిచిపోయాయి. దర్శకుడు ఫాజిల్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. రైటర్ మధు ఏవో కథల మీద పనిచేస్తున్నాడు. ఎవరి పనుల్లో వాళ్లు పడిపోయారు. ఓ రోజు ఫాజిల్ ఏదో ఫైలు కోసం వెతుకుతున్నారు. ఎక్కడో మూలన ఉంది రైటర్ మధు ఇచ్చిన నాగవల్లి కథ. ఆ కాగితం ఇప్పుడు రెపరెపలాడుతోంది... ఆయన దృష్టిలో పడేందుకేనా?
అన్ని ఫైల్సూ, కాగితాలూ తీసి చూస్తున్నారు ఫాజిల్. చివరికి ఈ కాగితం కూడా ఆయన కంటపడింది. తీసి చదివారు. ఇది మధు ముట్టమ్ రాసిన కథ... బాగుందే! అనుకున్నారు ఫాజిల్.
రొటీన్ సినిమాలు తీసి బోరు కొట్టినప్పుడు ఇలాంటి కథలు నచ్చుతాయి. విచిత్రంగా ఈ కథలో నాగవల్లి అనే దెయ్యం భయపెట్టడం లేదు, ప్రేమించేలా ఉంది. దెయ్యం అనే భయానికి సైకలాజికల్ ట్రీట్‌మెంట్. ఇందులో మెసేజ్ ఉంది. ఫాజిల్ మరి ఆలస్యం చేయలేదు. వెంటనే మధుకి కబురు పెట్టారు. కొద్దిరోజులు ఇద్దరూ కలిసి కథ వండేశారు. తర్వాత దాన్నే సినిమాగా తీశారు. అదే - మణిచిత్రతళు. అంటే నగిషీలు చెక్కిన తలుపు గడియ. అది ఓపెన్ చేస్తేనే కదా... అసలు కథంతా మొదలవుతుంది.
మలయాళం సినిమా సూపర్‌స్టార్స్ మోహన్‌లాల్, సురేశ్ గోపి హీరోలు. నాగవల్లి ఆవహించే గంగ పాత్రలో శోభన. అసలే గొప్ప క్లాసికల్ డ్యాన్సర్ శోభన. ఆ పాత్రలో చెలరేగిపోయింది. 1993 రిలీజ్ అయింది మణిచిత్రతళు. సూపర్‌హిట్. శోభనకు ఆ సంవత్సరం ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు ప్రకటించారు.

Sunday, December 12, 2010

ఆ ఒక్కటీ అడక్కు - మనీ

ఇంకొక బాపతు వాళ్లు ఉంటారు. వీళ్లకు డబ్బు సంపాదించే సకల శక్తియుక్తులూ ఉంటాయి. అయినప్పటికీ సంపాదించరు. లక్ష్మీదేవి ఉన్నపళంగా వచ్చి వొడిలో కూర్చోవాలని కలలు గంటారు. లక్కు రావాలంటారు. జాతకాలను నమ్ముకుంటారు. అలాంటివాడే అటుకుల చిట్టిబాబు.
పనిని దైవంగా భావించి కష్టపడి పైకొచ్చిన రొయ్యల నాయుడు కూతురు రంభ అటుకుల చిట్టిబాబుని ప్రేమిస్తుంది. చిట్టిబాబుకు జాతకాల పిచ్చి. ఆఫ్టర్ వన్ ఇయర్ నువ్వు కింగ్ అయిపోతావని ఎవరో జ్యోతిషుడు చెప్పడంతో అదే నిజం అని నమ్మి ఏ పనీ చేయకుండానే తనకు రాబోయే రాజయోగం గురించి కలలు కంటూ కాలక్షేపం చేస్తుంటాడు. ఇతనిలో తెలివి ఉంది కాని దానిని వాడటం లేదు అని గ్రహించిన రొయ్యలనాయుడు తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయడానికి లక్ష ఎదురుకట్నం అడుగుతాడు. పెళ్ళి అయ్యాక ఆ లక్ష ఇస్తేనే శోభనం అని అడ్డు నిలుస్తాడు. చిట్టిబాబు అడ్డదారుల్లో డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నాలన్నీ అతనికే ఎదురు తగులుతాయి. చివరకు తల్లి, చెల్లెలు కూడా అవమానాల పాలై, చిట్టిబాబుని ఈసడించుకోవడంతో బుద్ధి తెచ్చుకుని తన తెలివితేటలను పెట్టుబడిగా పెట్టి లక్ష రూపాయలు సంపాదిస్తాడు. చెల్లెలి పెళ్లి చేయించి, తన కాపురాన్ని నిలబెట్టుకుంటాడు. ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా కథ ఇది!
కొంతమందికి అవమానమే అచ్చుయంత్రం. ఆ అవమానం అయ్యాకే ఆ అచ్చుయంత్రం నుంచి నోట్ల కట్టలు పుట్టుకొస్తాయి.
గారడీలను మించిన గారడీ... ఇంద్రజాలాన్ని మించిన మాయాజాలం... డబ్బు. ఈ డబ్బు కళ్లజోడు పెట్టుకుని చూస్తే లోకమంతా ‘పచ్చ’గా, వెచ్చగా, తియ్యగా కనిపిస్తుంది. ‘మనీ’ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు అందుకే. మనీ మేక్స్ మెనీ ఫేసెస్ కూడా.
మనీ సినిమాయే చూడండి. ఇద్దరు హీరోలు... జె.డి. చక్రవర్తి, చిన్నా. ఇద్దరికీ ఆస్తిపాస్తులు లేవు. బిర్యానీ కాదు కదా, ప్లేటు మీల్స్‌కే వెతుకులాట. ఇంటద్దె కట్టలేక దొంగచాటుగా రూమ్‌లోకి అప్ అండ్ డౌన్ చేయాల్సిన పరిస్థితి. ఉద్యోగాల వేటలో తిరిగి తిరిగి అలసిపోయిన వీరిద్దరికీ పక్కింటి ఆంటీ జయసుధ ‘మహాలక్ష్మి’లాగా కనిపిస్తుంది. ఆమె నడుస్తుంటే కోటి రూపాయల బ్యాంక్ లాకర్‌లా అనిపిస్తుంది. బాగా డబ్బున్న ఆమెను కిడ్నాప్ చేస్తే తమ కథ సుఖాంతం అవుతుందని జేడీ, చిన్నా ప్లాన్ చేస్తారు. మొత్తానికి కిడ్నాప్ చేస్తారు. మరో వైపు జయసుధ భర్త పరేశ్ రావెల్ ఎలాగైనా ఆమెను అడ్డు తప్పించి మొత్తం ఆస్తంతా సొంతం చేసుకోవాలని ప్లాను.
డబ్బు... మనుషుల్ని ఎలా మార్చివేస్తుందో కొత్తగా చూపించిన సినిమా మనీ. చేసిన తప్పును

డబ్బు

మనిషి బతకడానికి తిండి కావాలి. నీళ్లు కావాలి. ఇల్లు కావాలి. బట్ట కావాలి. ఇంకా చదువుకీ, తిరుగుడికీ, పెట్రోల్‌కీ, సరదాలకీ, సంతోషాలకీ, మిఠాయిలకీ, పెళ్లిళ్లకీ, పండుగలకీ... ఒక్కటని కాదు, ఈ భూప్రపంచం మీద మనిషి అడుగు తీసి అడుగు వేయాలంటే... కావలసింది డబ్బు.
డబ్బు ఉంటేనే మనిషికి బతుకు.
డబ్బు ఉంటేనే మనిషికి విలువ.
డబ్బు ఉంటేనే మనిషికి పవర్.
ఒక్క మాటలో చెప్పాలంటే...
డబ్బే మనిషిని ఛార్జ్ చేస్తుంది. డబ్బు సంపాదించినప్పుడే మనిషి రీఛార్జ్ అవుతాడు.

*****
సుమారు యాభై ఏళ్ల కిందట... ముంబైలోని ఓ రద్దీ రోడ్డులో... చెట్టు కింద చిన్న టీ కొట్టు. అక్కడే చాయ్ అమ్మేవాడొక సేఠు. దారినపోతూ టీ తాగడానికి ఆగేవాళ్లతో చెలాకీగా కబుర్లు చెబుతూ వాళ్లను హుషారెత్తిస్తూ చాయ్ అమ్మేవాడు. అలా అతని దగ్గర టీ తాగేవారిలో ఒక వ్యక్తి మాత్రం రోజూ వచ్చేవాడు. నెత్తిన బట్టల మూట పెట్టుకుని, ఒక్కోసారి నడి మధ్యాహ్నం వేళ నడుచుకుంటూ, ఒక్కోసారి సైకిల్ తొక్కుకుంటూ ఆ టీ కొట్టు దగ్గరే ఆగేవాడు. ఆ కుర్రాడి అవస్థ చూసి సేఠు జాలిపడి ఫ్రీగా చాయ్ ఇచ్చేవాడు. ఎండలో తిరిగి తిరిగి అలసి ఉన్న ఆ కుర్రాడికి చాయ్ కాదు సాంత్వన. సాటి మనిషి తన కష్టాన్ని గుర్తించడమే గొప్ప ఊరట. ఆ గుర్తింపు కోసమే వచ్చేవాడు ఆ కురవ్రాడు. క్రమంగా అలా కొన్నాళ్లు వచ్చి... ఆ తర్వాత అటుగా రావడం మానేశాడు. ఆ చిన్న టీ కొట్టును చూసుకుంటూ సేఠు అలాగే ఉండిపోయాడు. ఓ రోజు ఓ ఖరీదైన కారు ఆ కొట్టు ముందు ఆగింది. అందులోంచి దిగాడు ఓ ఖరీదైన పెద్దమనిషి. నేరుగా సేఠు దగ్గరకు వచ్చి చాయ్ ఇమ్మని అడిగాడు. దగ్గరగా చూసి అప్పుడు గుర్తుపట్టాడా సేఠ్ - అతను గతంలో తన దగ్గర టీ తాగిన కురవ్రాడు. ఇప్పుడు పెద్దవాడయిపోయాడు. ధనికుడయ్యాడు. అయినా తనను మర్చిపోలేదు అతడు. గతంలో తాను ఫ్రీగా చాయ్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా... అతను అదే స్థలంలో కొత్త టీ స్టాల్‌ని పెట్టుకోడానికి బోలెడంత డబ్బు ఇచ్చాడు. ఇప్పుడక్కడ ఓ పెద్ద టీ కార్నర్ వెలిసింది.
ఆ ధనికుడు - ధీరూభాయ్ అంబానీ.
కనుక ఇవాళ లేనివాడు కదా అని చులకనగా చూడకూడదు. ఏమో.. ఎవరు చూడొచ్చారు.. రేపెపుడైనా అతడికి జాక్‌పాట్ తగుల వచ్చు. లక్షలు వచ్చి పడవచ్చు. అతడు పడవలాంటి కారులో వచ్చి ఉంచు అని ఒక సూట్‌కేస్ మనకు యివ్వొచ్చు. బీ కేర్‌ఫుల్.

‘క్షణక్షణం’

డబ్బు చేతికి అందలేదే అనుకోవడం వల్ల వచ్చిన బాధ కంటే చేతికి అందిన డబ్బు చేజారితే వచ్చే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది.
‘క్షణక్షణం’లో పరేశ్‌రావెల్ ఎంతో ప్లాన్ చేసి బ్యాంకును కొల్లగొట్టాడు. కోటి రూపాయలు వచ్చాయి. కాని అవి వచ్చినంత సేపటిలో మాయమయ్యి హీరో హీరోయిన్‌లకు దొరికాయి. ఇక అక్కడి నుంచి సాగే వేట చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కామెడీగా ఉంటుంది.
‘నేను వందరూపాయలకు కూడా మర్డర్ చేసిన సందర్భాలున్నాయి’ అంటాడు పరేశ్‌రావెల్. అలాంటి వ్యక్తి కోటిరూపాయల కోసం ఎంతకైనా తెగిస్తాడు.
కోటి- కొండమీది కోతినైనా తెచ్చుకోవచ్చు.
ఐదు నక్షత్రాల పూటకూళ్ల ఇంట్లో దిగొచ్చు. సొంతవిమానం మాట్లాడుకొని ఆకాశంలో షికారు చేయవచ్చు.
ఇన్ని డబ్బు ఇస్తుంది కాబట్టే అదంటే అంత వెర్రి.
ఆ వెర్రిలో పడి మనిషితనాన్ని మర్చిపోకూడదు కదా. అదే మనం గుర్తు పెట్టుకోవాల్సిన నీతి.

ప్రేమపావురాలు -నువ్వొస్తానంటే నేనొద్దంటానా-మొఘల్-ఏ-ఆజమ్

ఇక ప్రేమకథలలో డబ్బు పాత్రకు కొదవే లేదు. డబ్బున్న అమ్మాయి - పేద అబ్బాయి, కుబేరుడైన అబ్బాయి - పేద అమ్మాయి ఈ కథలు నిన్న నేడు రేపు ఎల్లుండి కూడా ఉంటాయి. ప్రేమపావురాలు సినిమాలో సల్మాన్‌ఖాన్ చాలా పేదింటి అమ్మాయిని ప్రేమిస్తాడు. కాని అతడు ఐశ్వర్యవంతుడి కొడుకు. కష్టం తెలియనివాడు. సొంతంగా సంపాదించడం తెలియనివాడు. అందుకే అమ్మాయి తండ్రి ‘నెల రోజుల్లో రెండు వేలు సంపాదించి చూపించు, అప్పుడు నా కూతురిని యిచ్చి పెళ్లి చేస్తాను’ అంటాడు. సల్మాన్‌ఖాన్ ఆ రెండు వేలు సంపాదిస్తాడు. ప్రియురాలి పాటనే ఓదార్పుగా చేసుకొని కష్టపడి సంపాదిస్తాడు. దీనికి దగ్గరి కథే నువ్వొస్తానంటే నేనొద్దంటానా. అందులో హీరో డబ్బుసంపాదించి చూపిస్తే ఇందులో హీరో వ్యవసాయం చేసి చూపిస్తాడు.
ఇరువర్గాలు సమానంగా ఉంటే ప్రేమకథల్లో మజా లేదు. అనార్కలీ ఇంకో దేశపు రాకుమారి అయ్యుంటే మొఘల్-ఏ-ఆజమ్ కథే లేదు.
ఎవరికో ఒకరికి ఎక్కువో తక్కువో ఉండాలి. నడిమధ్యన డబ్బు ఒక ఆట ఆడాలి.
అదే అసలైన కిక్కు.

రాబిన్‌హుడ్-జెంటిల్‌మెన్-కిక్-శివాజీ

ఏకాలంలో అయినా డబ్బుకు లైను వేసి దానిని ఎత్తుకెళ్లేవాడు ఉంటాడు లోకంలో. అలాంటివాణ్ణి రాబిన్‌హుడ్ అంటారు. డబ్బున్నవాళ్లను కొట్టి పేదవాళ్లకు పెట్టే రాబిన్‌హుడ్‌కు ప్రజలలో ఎప్పటికీ తరగని క్రేజ్. జెంటిల్‌మెన్‌లో అర్జున్ చేసింది అదే. పెద్దపెద్దవాళ్ల డబ్బును దొంగిలించి పేదవాళ్ల కోసం యూనివర్సిటీని కట్టాడు అర్జున్. తాజాగా ‘కిక్’ సినిమాలో రవితేజా చేసింది కూడా అదే. బడాబాబుల జేబుకొట్టి ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడే పేదపిల్లల కోసం హాస్పిటల్ కట్టిస్తాడతడు. ఇక శివాజీ అయితే ప్రతి ఊరినీ స్వర్గం చేయడానికి ఏకంగా దేశంలోని నల్లధనం మీదే దండెత్తాడు.
అమెరికాలో కంప్యూటర్ ఇంజనీర్‌గా పని చేసి 250 కోట్ల రూపాయల మొత్తంతో మన దేశంలో పెద్ద మెడికల్ కాలేజీ కట్టాలనే ఆశయంతో వస్తాడు శివాజి. తద్వారా పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్య అందించాలని కలలు కంటాడు. కాని కాలేజీలు పెట్టి విద్యను వ్యాపారంగా చూసే ఆదిశేషుకు అది నచ్చదు. అందుకని శివాజీ ప్రయత్నాలకు అడ్డుపడుతుంటాడు. తన పలుకుబడిని ఉపయోగించి శివాజీ కట్టిస్తున్న కాలేజీకి పర్మిషన్లు రద్దు చేయించి, దాన్ని నేల కూల్చివేయిస్తాడు. శివాజీని అరెస్టు చేయించి జైల్లో పెట్టించి చిత్రహింసలకు గురి చేస్తాడు. అయినా శివాజీ భయపడడు. గుంపులు గుంపులుగా ఉండే ఇలాంటి విలన్‌లపై సింహంలా సింగిల్‌గా కలబడతాడు. మూటలు మూటలుగా పేరుకొని ఉన్న నల్ల డబ్బును వెలికి తీయిస్తాడు.

శుభలగ్నం

డబ్బు ఒక్కోసారి కళ్లకు గంతలు కట్టొచ్చు. అప్పుడు మెడలో ఉన్న మాంగల్యం కూడా కనిపించకపోవచ్చు. కనుక డబ్బును ఒక కంట కాదు రెండు కళ్లతోనూ కనిపెడుతూ ఉండాలి. లేకుంటే బతుకు శుభలగ్నంలో ఆమనిలా తయారవుతుంది. మధ్యతరగతి జీవితంతో విసిగిపోయిన ఆమని కోటీశ్వరురాలైన ఒక అమ్మాయికి తన భర్తని కోటి రూపాయలకు అమ్మేస్తుంది. అమ్మేశాక భర్తను ఆ అమ్మాయితో పంచుకోలేక నానా బాధలు పడుతుంది. నోట్ల కట్టల మీద పడుకుంటే నిద్ర రాదు... ఎంత పేదవాడైనా భర్త కౌగిట్లో పడుకుంటేనే భార్యకు నిద్ర వస్తుంది అని చెప్పే కథ

‘ఛాలెంజ్’

చాలామందికి డబ్బు సంపాదించడం వచ్చు. అయినప్పటికీ డబ్బు సంపాదించడమే వాళ్లు జీవితం అనుకోరు. అలాంటి తెలివైన నిరుద్యోగి గాంధీ. పేదవాళ్లని చులకనగా చూస్తూ పేదరికాన్ని అవమానించే ధన అహంకారి రామ్మోహనరావు. వీళ్లిద్దరి మధ్య నడిచిన పోరాటమే ‘డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు’.
తన ఫ్యాక్టరీలో మేనేజర్ పోస్ట్‌కు, టైపిస్ట్ పోస్ట్‌కు, బంట్రోతు పోస్ట్‌కు అర్హత గల అభ్యర్థులు కావాలని ఓ పత్రికలో ప్రకటన ఇస్తాడు రామ్మోహనరావు. నిజానికి అతని కంపెనీలో బంట్రోతు ఉద్యోగం మాత్రమే ఖాళీ ఉంటుంది. మరి మిగతా రెండు పోస్ట్‌లకు ప్రకటన ఎందుకు? అదే విషయం ఆరా తీస్తుంది అతని కూతురు హారిక. రామ్మోహనరావు పొగరుగా నవ్వేస్తాడు.
‘ఏ పోస్ట్‌కు ఎంతమంది అప్లయ్ చేస్తారో చూద్దాం అని సరదాగా చేశా’నంటాడు.
అన్ని పోస్ట్‌లకు లెక్కకు మించిన అప్లికేషన్స్ వస్తాయి. బంట్రోతు పోస్ట్‌కు మాత్రం ఒక్కటే అప్లికేషన్ వస్తుంది. అది కూడా స్టాంపులు లేకుండా! ఆ దరఖాస్తుదారుని పేరు గాంధీ. స్టాంపుల్లేని కవర్ పంపి... ఎదురు డబ్బు కట్టించి ఆ కవర్ తీసుకునేటట్లు చేసిన గాంధీ పొగరుబోతుతనానికి తగిన శాస్తి చేయాలనుకుంటాడు రామ్మోహనరావు. గాంధీని పిలిపించి ఇంటర్వ్యూ చేయకుండానే వెళ్లిపొమ్మంటాడు. గాంధీ అహం దెబ్బతింటుంది. ‘‘ఓ తెలివైన కుర్రాడు తలుచుకుంటే డబ్బు సంపాదించడం పెద్ద కష్టం ఏమీ కాదు’’ అని ఛాలెంజ్ చేస్తాడు.
దమ్ముంటే ఐదేళ్లలో యాభై లక్షలు సంపాదించమని ప్రతిసవాల్ విసురుతాడు రామ్మోహనరావు. అది అసాధ్యం అని నమ్ముతాడు రామ్మోహనరావు. గాంధీ ఛాలెంజ్‌ని ఎంత తేలికగా తీసుకుంటాడంటే... అతను గనుక గెలిస్తే తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానని పందెం కాస్తాడు.
అహం దెబ్బతిన్న గాంధీ ఈ ఛాలెంజ్‌ని సీరియస్‌గా తీసుకుంటాడు. ఐదేళ్లలో యాభై లక్షల రూపాయలు సంపాదించి రామ్మోహనరావు పొగరు అణగ్గొడతాడు

అరుణాచలం

నెలరోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టాలి... అప్పుడే తండ్రి వారసత్వంగా ఇచ్చిన మూడువేల కోట్ల రూపాయలకు వారసుడవుతాడు... ఇది అరుణాచలం సినిమా కధ.  హీరో తన స్టైల్‌లో లక్ష్యాన్ని సాధించి తండ్రి ఆస్థికి వారసుడవుతాడు.

మనిషి డబ్బును ఎంత తక్కువ ఆశిస్తే.. మనిషిగా అతని విలువ అంత పెరుగుతుందని చెప్పడానికి మనకో ‘అరుణాచలం’ ఉన్నాడు. ఎంత గొప్ప కథ... అరుణాచలానిది!
నా అనుకున్న వారందరి నిరాదరణకు గురవుతాడు అరుణాచలం. ఉన్న ఊరికి, అయిన వారికీ దూరంగా సిటీలో బతుకుతుంటాడు. ఉద్యోగం కోసం వెతుకుతున్న క్రమంలో అతను కోటీశ్వరుడైన సింహాచలం కొడుకునన్న నిజం తెలుసుకుంటాడు. తండ్రి కష్టార్జితం అయిన 30 వేల కోట్ల రూపాయల ఆస్తి ట్రస్టీల చేతుల్లో ఉంటుంది. ఆ ఆస్తి అరుణాచలానికి చెందాలంటే ఒక నెల రోజుల్లో 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని తండ్రి షరతు విధిస్తాడు. ఆ షరతును అరుణాచలం నిరాకరిస్తాడు. వారసత్వంగా వచ్చే సంపదతో కాలు మీద కాలేసుకుని బతికేవాడు తన దృష్టిలో మగాడు కాడనీ, తల్లిదండ్రుల ఆస్తిని ఆశించకుండా కాయకష్టంతో చెమటోడ్చి భార్యాపిల్లలను పోషించేవాడే మగాడని అక్కణ్ణుంచి వెళ్లిపోతాడు అరుణాచలం. కాని ఆ ట్రస్టీలు తన తండ్రి ఆస్తిని ఎలాగైనా కొట్టేయాలనుకుంటున్న నిజం తెలుసుకుని, తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. తండ్రి కష్టార్జితాన్ని పాపాత్ముల పాలవ్వకుండా కాపాడటానికి కంకణం కట్టుకుంటాడు. నెల రోజుల్లో ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి అంగీకరిస్తాడు. అరుణాచలాన్ని ఓడించడానికి వారు వేస్తున్న ఎత్తులను, కుట్రలను చిత్తు చేస్తూ... చివరకు అరుణాచలం విజేతగా నిలుస్తాడు. తండ్రి నుంచి సంక్రమించిన వేలాది కోట్ల రూపాయల ఆస్తిని పేద ప్రజలకు పంచి... మళ్లీ తను పెరిగిన ఊరికి తన వాళ్ల దగ్గరకు చేరుకుంటాడు.
అయితే, సమాజంలో మనకు అరుణాచలం లాంటి వాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు.












సినిమా : వద్దంటే డబ్బు
తారాగణం : రామారావు ,షావుకారు జానకి ,పేకేటి శివరాం,జమున,రాజనాల (నాకు తెలిసిన వారు)
దర్శకుడు: స్వామి.వి ఆర్.

నాలుగు నెలలనుండి రాద్దామని అనుకుంటూ వాయిదా వేస్తూ వచ్చాను, ఇవ్వాళ కుదిరింది.


ఇక సినెమా కధ వద్దకు వస్తే రామారావు(పేకేటి శివరాం) ,శ్యాం(రామారావు) ఇద్దరు మంచి స్నేహితులు . రామారావు కవి ఐతే ,శ్యాం చిత్రకారుడు అన్నమాట. శ్యాం చాలా భయస్తుడు,అమాయకుడు ఐతే రామారావు మంచి మాటకారి ,తెలివి కలవాడు. కాని ఇద్దరికీ మంచి అవకాశాలు రాక చాలా కష్టపడుతూ వుంటారు. అప్పుడప్పుడు భోజనం కోసం శ్యాం గీసే చిత్రాలు అమ్ముతూవుంటారు .
రేఖ(జమున) ,రామారావు ప్రేమించుకుంటూ వుంటారు. ఈమె రేడియోలో గాయని.అప్పుడప్పుడు రామారావు రాసే కవిత్వాని పాడుతూవుంటుంది. అప్పుడప్పుడు వీరికి సహాయం కూడా చేస్తూ వుంటుంది.
సరోజ (షావుకారు జానకి) శ్యాం గీసే చిత్రాలకి పెద్ద అభిమాని .ఒక రోజు శ్యాం రేఖని చూసి ఆమె చిత్రం గీయాలనుకుంటాడు. అప్పుడు రేఖ తన స్నేహితురాలు సరోజని తీసుకు వచ్చి పరిచయం చేస్తుంది. అలా ఆమె చిత్రాన్ని గీస్తున్న సమయంలో ఇద్దరు ప్రేమించుకుంటారు .

సరోజ బలవంతం మీద శ్యాం తమ ప్రేమగురించి ఆమె తండ్రితో చెప్పడానికి బయలుదేరుతాడు.సరోజ తండ్రి(రాజనాల) బాగా వున్నవాడు .అతను వీళ్ళ ప్రేమను పరీక్షింప తలచి శ్యాంకి ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఒక నెలలోపు ఖర్చు చేసి రమ్మని చెబుతాడు. ఎవరికీ అప్పు ఇవ్వకూడదు అనే షరతు పెడతాడు. ఇక లక్ష రూపాయలు ఖర్చు చేయడానికి వీళ్ళు పడే పాట్లు చూడాలి. వీళ్ళు ఎంత ఖర్చు పెడదామనుకున్నా ఇంకా ఎక్కువ డబ్బులు తిరిగి వస్తూవుంటాయి.

చాలా హాస్యం వున్న సినిమా.ఇంటి అద్దె అడిగే ఇంటి యజమానురాలిని, అలాగే చేసిన అప్పు అడిగే సాయిబుని తప్పించుకోవటానికి వీళ్ళు పడేపాట్లు మొదటి భాగంలో మంచి హాస్యాన్ని పండిస్తే , లక్ష రూపాయలు ఖర్చు చేయడానికి వీళ్ళు పడే పాట్లు రెండో భాగంలో కడుపుబ్బా నవ్విస్తాయి.

పాటలు కూడా చాలా బాగుంటాయి. నాకు ఐతే " నాతొ అవుననవా " అనే పాట చాలా బాగా నచ్చింది. సంగీతం కళ్యాణం గారు .

ఈ సినెమా చూసే "బాబాయ్-అబ్బాయ్ ","అరుణాచలం" సినిమాలు తీసారు అనుకుంట. నేను ఎంత బాగా రాద్దామనుకున్నా ఇంతకంటే బాగా రాయలేకపోయాను.మీరు సినిమా చూడండి తప్పక నచ్చుతుంది ,నాది భరోసా.

జగదేకవీరుని కధ

ఉదయగిరి మహారాజుకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ప్రతాప్. చిన్నవాడు జగజ్జిత్తు. ప్రతాప్‌కున్న ఒకే కల. చలువరాతి మేడలో తూగుటుయ్యాలపై దేవకన్యలు ఇంద్రకుమారి, నాగకుమారి, వరుణకుమారి, అగ్నితనయ తన చుట్టు చేరి సేవలు చేస్తుండగా జీవితాన్ని ఆనందంగా అనుభవించాలని కోరిక. అది తెలుసుకున్న తండ్రి కోపంతో దేశబహిష్కారం చేస్తాడు. అలా బయటకు వెళ్లిన ప్రతాప్ దేవకన్యలకోసం వెతుకుతూ ఉంటాడు. అలా వెడుతుండగా కలిసిన దయ్యాల సాయంతో దేవకన్యలు జలకాలాడే చోటుకి వెళ్లి పొరపాటున శిలగా మారతాడు. కాని అతని తల్లి ప్రార్ధనలతో సంతోషించిన పార్వతీదేవి అతనికి మానవ రూపం రప్పిస్తుంది. ఇంద్రపుత్రిక జయంతి ఒకరోజు ఏమరుపాటుగా చేసిన తప్పుకు కోపించిన ముని శాపం ఇస్తాడు. దాని ప్రకారం ఆమె వస్త్రాలను దోచుకు పోయినవాడితో ఆమె పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. కొద్ది కాలానికి , తన వలువలు దోచిన ప్రతాప్‌ని జయంతి వరిస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ కామకూట రాజ్యానికి వెడతారు. కామాంధుడైన ఆ దేశపు రాజు జయంతి అందాన్ని చూసి వివశుడై వారిద్దరిని విడదీయాలని ప్రయత్నించి తనే పతనమవుతాడు. ఆ రాజు చేసిన కుతంత్రంలో భాగంగా ముల్లోకాలకు వెళ్లిన ప్రతాప్ ఇంద్రకుమారి జయంతి స్నేహితురాళ్లని కూడా పెళ్లి చేసిని భూలోకానికి తిరిగొస్తాడు. అందరితో కలిసి సంతోషంగా ఉండగా. ఒకరోజు ప్రతాప్ లేని సమయంలో జయంతి అత్తగారిని మభ్యపెట్టి ప్రతాప్ దాచిన తన చీరెను తీసుకుంటుంది. అది లభించడంతో ఆమె శాపవిమోచనమవుతుంది. తన స్నేహితురాళ్లతో కలిసి స్వర్గానికి వెళ్లిపోతుంది. కాని ఆ దేవకన్యలందరూ తమ భర్తపై ప్రేమని చంపుకోలేకపోతారు. చివరగా దేవతలు పెట్టిన పరీక్షలో నెగ్గి ప్రతాప్ తన భార్యలను తీసుకుని భూలోకానికి వచ్చేసి సుఖంగా రాజ్యపాలన చేస్తాడు.